కామసూత్ర నటికి కరోనా కష్టాలు

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా ప్రవేశించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు. హాలీవుడ్‌లో 'కామసూత్ర', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సినిమాల్లో నాయికగా నటించిన, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మకు కరోనా సోకింది.




ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్‌ (కోవిడ్-19) పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందిరా వర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కాగా, ఇండియాలో ఇప్పటికే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో కూడా ప్రముఖ నటుడు టామ్‌ హ్యాంక్స్‌, ఆయన భార్య రీటా విల్సన్‌, జేమ్స్‌ బాండ్‌ నటి ఓల్గా కురిలెంకోతో పాటు మరికొందరు తారలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. చదవండి: కరోనా: బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఏమన్నారంటే